Mantralayam Tragedy: మంత్రాలయంలో ఘోర విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు, ఒకరి కోసం గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నదిలో మునిగిపోయిన వారిలో ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించి వెలికితీశారు. మరో వ్యక్తి కోసం గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారంతా తమ బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యేందుకు మంత్రాలయానికి వచ్చారు. పూజ కార్యక్రమాలకు ముందు సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు దిగగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలోని నీటి లోతును సరిగా అంచనా వేయలేకపోవడంతో వారు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
గాలింపు చర్యలు వేగవంతం
ఈ ఘటనలో శనివారం ధను (23) మృతదేహాన్ని గుర్తించి వెలికితీయగా, ఆదివారం సతీష్ (35), సంధ్య (22), యువన్ చంద్ర (5) మృతదేహాలు కూడా లభించాయి. కాగా హైదరాబాద్కు చెందిన రాఘవేంద్ర (25) కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు ఈ ప్రమాదంలో ఆదోనికి చెందిన అపర్ణ అనే యువతి సురక్షితంగా బయటపడింది. ఆమె అందించిన సమాచారంతో సహాయక బృందాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఈ దుర్ఘటనతో మంత్రాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మిగిలిన వ్యక్తి ఆచూకీ కోసం అధికారులు యుద్ధప్రాతిపదికన శోధన కొనసాగిస్తున్నారు.