మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటనపై సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అపిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని అందులో పేర్కొంది. ప్రస్తుతం అధికారికంగా ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలని కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించిన తర్వాతే ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. ఇండియాకు కూటమికి చెందిన 21 మంది ఎంపీలు నేడు మణిపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.