
Honeymoon Murder: 'హనీమూన్ హత్య' కేసులో మలుపు.. ఇందౌర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'హనీమూన్ హత్య' (Honeymoon Murder) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా మేఘాలయ పోలీసులు ఇందౌర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ను అరెస్టు చేశారు. రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను దాచిపెట్టినట్లు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. 'రఘువంశీని హత్య చేసిన తర్వాత మే 25 నుంచి 27 మధ్య సోనమ్ రైలులో ఇందౌర్కు చేరింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుశ్వాహాను కలిసింది. అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారి జేమ్స్ వద్ద రాజ్ కుశ్వాహా ఓ గదిని అద్దెకు తీసుకుని కొంత కాలం సోనమ్ను దాచిపెట్టాడు. ఈ విషయంపై తొలుత జేమ్స్ను ప్రశ్నించగా, రూ.17,000 కిరాయికి గదిని అద్దెకు ఇచ్చినట్టు తెలిపాడు.
Details
20న మేఘాలయకు వెళ్లిన జంట
అలాగే వారు వెళ్లిన తరువాత గదిలో ఎలాంటి వస్తువులు కనబడలేదని పేర్కొన్నాడు. కానీ దర్యాప్తులో రఘువంశీ హత్యకు ఉపయోగించిన కీలక ఆధారాలు ఉన్న బ్యాగ్ను సోనమ్ అద్దె గదికి రాజ్ కుశ్వాహా తీసుకువచ్చినట్టు తేలింది. ఆ బ్యాగ్ను జేమ్స్ దాచినట్లు అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా గది రాజ్ కుశ్వాహా కాకుండా, ఈ కేసులో అరెస్టయిన మరో నిందితుడు విశాల్ చౌహాన్ అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. విశాల్తో జేమ్స్కి కూడా పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 11న రాజా రఘువంశీని సోనమ్ వివాహం చేసుకోగా, 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడే రఘువంశీ అదృశ్యమయ్యాడు.
Details
పలువురు అరెస్టు
11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలో లోయలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనమ్ ఘాజీపూర్లో ప్రత్యక్షమయింది. ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలసి రఘువంశీని హత్య చేసినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో మేఘాలయ పోలీసులు సోనమ్తో పాటు రాజ్ కుశ్వాహా (21), విశాల్ సింగ్ చౌహాన్ (22), లలిత్పూర్కి చెందిన ఆకాశ్ రాజ్పూత్ (19)లను ఇప్పటికే అరెస్టు చేశారు.