Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి
దిల్లీ తుగ్లక్ లేన్లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాలిక ఇంటి బయట కూర్చుని ఉండగా.. నాలుగైదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఈ క్రమంలో కుక్కలు బాలికను 100 నుంచి 150 మీటర్ల దూరం లాక్కెళ్లాయి. ఆ సమయంలో అదే దారిలో సైకిల్పై వస్తున్న వ్యక్తి గట్టిగా అరిచి.. చుట్టుపక్కల వాళ్లను పిలవడంతో.. స్థానికులు క్కుక్కలను తరిమికొట్టారు. తీవ్రగాయలపాలైన బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
వీధి కుక్కల బెడదను నివారిస్తాం : దిల్లీ కార్పొరేషన్ మేయర్
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శైలి ఒబెరాయ్ మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీధికుక్కల సంచారం అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాబోయే కాలంలో ఎన్డీఎంసీ, ఎంసీడీ కలిసి పని చేస్తాయన్నారు. వీధి కుక్కల బెడద నుంచి దిల్లీ ప్రజలను ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులు ఎవరైతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.