
AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్టులో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తుది లబ్ధిదారుడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశోధనలో వెల్లడైంది.
మద్యం సరఫరా కంపెనీలు,డిస్టిలరీల నుంచి ప్రతినెలా రాజ్ కెసిరెడ్డి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేసి, ఆ మొత్తం నేరుగా జగన్కి చేరేలా చేసినట్టు దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవస్థను జగన్ సోదరుడు వై.ఎస్.అనిల్రెడ్డి (జగన్ పెదనాన్న వై.ఎస్. జార్జిరెడ్డి కుమారుడు), భారతి సిమెంట్స్కి చెందిన గోవిందప్ప బాలాజీ (జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి),వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి,మరో కీలక నేత విజయసాయిరెడ్డి కలిసి నడిపినట్లు సమాచారం.
వివరాలు
బూనేటి చాణక్యకి 14 రోజుల రిమాండ్
2019 నుండి 2024 మధ్యకాలంలో ఈ రకంగా మొత్తం రూ.3,200 కోట్లకు పైగా ముడుపులు వసూలు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) రాజ్ కెసిరెడ్డి. అతని ప్రాతినిధ్యంలో ముడుపుల వసూళ్ల వ్యవస్థను నిర్వహించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్ (ఏ8)ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు.
న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సిట్ రిమాండ్ రిపోర్టులో దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలను పేర్కొంది.
వాటిలో ముఖ్యమైనవి ఇవే:
వివరాలు
బేసిక్ ధరపై 20 శాతం ముడుపులు
నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డి (ఏ6), 2019లో హైదరాబాద్లో డిస్టిలరీ యజమానులతో సమావేశమయ్యారు.
ముడుపులు చెల్లించని కంపెనీలకు మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వమని బెదిరించారు.
మొదట 12 శాతం ముడుపులకు అంగీకరించిన డిస్టిలరీలు, కొంతకాలానికే 20 శాతం ముడుపులకు సమ్మతించాయి.
ఆ తరువాత ఆ కంపెనీలు ప్రతినెలా సగటున రూ.50-60 కోట్లు ముడుపులుగా చెల్లించేవి.
ఆ సొమ్ము ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, వై.ఎస్. అనిల్రెడ్డి ద్వారా జగన్కు చేరించబడేది.
వివరాలు
అధిక సరఫరా ఆర్డర్లతో అదాన్, లీలా డిస్టిలరీలు
అదాన్, లీలా డిస్టిలరీలకు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు.
ప్రభుత్వ మద్యం షాపుల్లో వీరి బ్రాండ్లే ప్రధానంగా విక్రయించబడ్డాయి.
విశాఖ, పీఎంకే, ఎస్పీవై, ఎంబీడీఎల్ డిస్టిలరీల ప్రాంగణాల్లో వీరు సబ్లీజ్ ద్వారా మద్యం తయారీ జరిపారు.
మిథున్రెడ్డి కంపెనీలోకి అనుమానాస్పదంగా రూ.5 కోట్లు
ఎస్పీవై అగ్రో డిస్టిలరీ నుంచి భారీగా సరఫరా ఆర్డర్లు వెళ్ళాయి. సన్హోక్ ల్యాబ్స్, డీకార్ట్ లాజిస్టిక్స్, ఎస్పీవై మధ్య రూ.60 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు తెలిసింది.
2021 అక్టోబరు 3న డీకార్ట్ ఖాతా నుంచి మిథున్రెడ్డి కంపెనీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు రూ.5 కోట్లు జమయ్యాయి.
దీనిపై 'క్విడ్ ప్రో కో' అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత విచారణ కొనసాగుతోంది.
వివరాలు
అదాన్, లీలా డిస్టిలరీల వ్యాపార లెక్కలు
అదాన్ డిస్టిలరీ (డైరెక్టర్లలో విజయసాయిరెడ్డి ప్రతినిధి శ్రీనివాస్, రాజ్ కెసిరెడ్డి ప్రతినిధి అనిరుధ్రెడ్డి) 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య రూ.732 కోట్లు వ్యాపారం చేసింది.
లీలా డిస్టిలరీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య రూ.454 కోట్లకు పైగా వ్యాపారం చేసింది.
మొదట పెనక రోహిత్రెడ్డి, శరత్చంద్రారెడ్డి ఖాతాల నుంచి వర్కింగ్ క్యాపిటల్ అదాన్ ఖాతాలోకి మళ్లించారు. వీరి వెనుక కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
వివరాలు
ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం
2019-2024 మధ్య వైకాపా హయాంలో, ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకుడు (హయ్యర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్), ఉన్నతాధికారుల సహకారంతో ఈ కుంభకోణం జరిగింది.
ఈ కుంభకోణం వలన ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లింది.
అధికారిక హోదా, పరపతిని ఉపయోగించుకుని వీరు మద్యం వ్యాపారంలో అక్రమ లాభాలు గడించారు.
ఏపీఎస్బీసీఎల్కు లంచాలు చెల్లించిన కంపెనీలే ప్రభుత్వ దుకాణాల్లో బ్రాండ్లను విక్రయించేవి.
ప్రజలు కోరిన మద్యం బ్రాండ్లు దొరకకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయినా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
వివరాలు
బంగారం వ్యాపారుల ద్వారా ముడుపుల చెల్లింపులు
డిస్టిలరీలు ముడుపులు బంగారం వ్యాపారుల ఖాతాల ద్వారా చెల్లించేవి.
బంగారం కొనుగోలు చేసినట్లుగా జీఎస్టీ ఇన్వాయిసులు సృష్టించి, వ్యాపారులు ముడుపులు తిరిగి బినామీలకు చెల్లించేవారు.
ఈ విధమైన అనేక అనుమానాస్పద లావాదేవీలు సిట్ దర్యాప్తులో బయటపడ్డాయి.