CIC : సీఐసీ ఎంపికలో నన్ను గాలికి విసిరేశారు.. రాష్ట్రపతికి అధిర్ రంజన్ లేఖ
భారత ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా ఎంపికపై కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీనే పూర్తి నిర్ణయాధికారంగా ఉన్నారని, తనను పెద్దగా పట్టించుకోలేదని, గాలికి విసిరేశారని లోక్సభ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (CIC) హీరాలాల్ సమారియా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల (ICలు) ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్షాల వాణి వినిపించలేదని, సెలక్షన్ చేసే క్రమంలో ప్రతిపక్షాల గొంతు కూడా వినిపించాలని ప్రజాస్వామ్య నిబంధనలు భావించినా అది నెరవేరలేదన్నారు. నియామకాల కమిటీలో ప్రధాని, హోంశాఖ మంత్రి, ప్రతిపక్ష నేత ఉంటారు.