Live-in Relationship: లివిన్ రిలేషన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ హైకోర్టు లివిన్ రిలేషన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరంగా యుక్తవయస్సు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో సహజీవనం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లికి నిర్ణయించిన కనీస వయస్సు పూర్తిగా చేరుకోకపోయినా, లివిన్ రిలేషన్లో ఉండడాన్ని అడ్డుకోలేమని తెలిపింది. పెళ్లి వయసును కారణంగా చూపి, వ్యక్తుల రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను న్యాయమూర్తి జస్టిస్ అనూప్ ధండ్ తన తీర్పులో వెల్లడించారు. 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు ఇటీవల రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
వివరాలు
తామిద్దరం పరస్పర అంగీకారంతోనే లివిన్ రిలేషన్లో..
తామిద్దరం పరస్పర అంగీకారంతోనే లివిన్ రిలేషన్లో ఉన్నామని వారు కోర్టుకు వివరించారు.
ఇంకా, 2025 అక్టోబర్ 27వ తేదీన సహజీవనానికి సంబంధించిన ఓ ఒప్పందం కూడా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే యువతి కుటుంబ సభ్యులు ఈ రిలేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
తమను హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆ జంట ఆరోపించింది.
అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తమ ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని పిటిషన్లో వెల్లడించారు.
ఈ పిటిషన్కు వ్యతిరేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరీ వాదనలు వినిపించారు.
యువకుడికి ఇంకా 21ఏళ్లు నిండలేదని, అతనికి చట్టపరంగా పెళ్లి వయస్సు రాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అందువల్ల లివిన్ రిలేషన్ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వవద్దని ఆయన అభ్యర్థించారు.
వివరాలు
యువ జంటకు పూర్తిస్థాయి భద్రత
అయితే ఈ వాదనలను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. పెళ్లి వయస్సు చేరుకోలేదన్న కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారతీయ చట్టాల ప్రకారం లివిన్ రిలేషన్ను నిషేధించలేమని, దాన్ని నేరంగా కూడా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
ఈ పిటిషన్లో నమోదైన అంశాలను సమగ్రంగా విచారించాలని బిల్వారా, జోధ్పూర్ పోలీసులను జస్టిస్ అనూప్ ధండ్ ఆదేశించారు.
అదే సమయంలో యువ జంటకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని తన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది.