2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. రక్షణ ఉత్పత్తి దేశాల సరసన చేరడానికి భారతదేశం ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'ఏరో ఇండియా 2023' ఈవెంట్ భారత్ కొత్త ఆలోచనను ప్రతిబింబిస్తుందన్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, భారతదేశం బలం అన్నారు. నేడు భారత్ ప్రపంచ రక్షణ కంపెనీలకు మార్కెట్ మాత్రమే కాదని, భాగస్వామి అని మోదీ ప్రకటించారు.
భారత సాంకేతికత తక్కువ ఖర్చుతో కూడుకున్నది: మోదీ
21వ శతాబ్దపు భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాని కలలను సాధించేందుకు కష్టపడి పనిచేయడానికి వెనుకాడబోదని స్పష్టం చేశారు. తమ సాంకేతికత తక్కువ ఖర్చుతో కూడుకున్నది మోదీ చెప్పారు. అలాగే నిజాయితీతో కూడుకున్నది, విశ్వసనీయమైనదని వివరించారు. తేజస్ యుద్ధ విమానాలు, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు తుమకూరులోని హెలికాప్టర్ ఫ్యాక్టరీ 'మేక్ ఇన్ ఇండియా' శక్తికి నిదర్శనమని మోదీ అన్నారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్-బిజినెస్' కోసం భారత్ చేసిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశీయ ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి భారత్ అనేక చర్యలు తీసుకుందని మోదీ చెప్పారు.