Andhra Pradesh : రెండేళ్లలో 77% పెరిగిన వ్యవసాయ రుణాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి. 2023లో రాష్ట్రంలోని రైతులకు వివిధ బ్యాంకులు రూ.1.27 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాలు మంజూరు చేయగా, 2025 నాటికి ఈ మొత్తం రూ.2.25 లక్షల కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా సగటు రుణ వృద్ధి 41 శాతంగా ఉండగా, ఏపీలో మాత్రం 77 శాతం వృద్ధి నమోదు కావడం విశేషంగా మారింది. సోమవారం లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్చౌధరి ఈ వివరాలను వెల్లడించారు.
వివరాలు
బ్యాంకుల్లో ఎవరూ తీసుకోని డిపాజిట్లు రూ.2,279.16 కోట్లు
ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిస్థితిని కూడా ఆయన వివరించారు. రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఎవరూ తీసుకోని డిపాజిట్లు మొత్తం రూ.2,279.16 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అమలాపురం తెదేపా ఎంపీ జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన, ఈ డిపాజిట్లకు సంబంధించిన ఖాతాదారులను గుర్తించి వెంటనే పరిష్కారం చూపాలంటూ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 158 ప్రత్యేక క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 28 వరకు 1,899 ఖాతాలకు సంబంధించిన రూ.5.08 కోట్లను ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించారు.
వివరాలు
స్వయం సహాయక సంఘాల మొండి బకాయిలు రూ.407.62 కోట్లు
అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మొండి బకాయిలు రూ.407.62 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత దేశంలో అత్యధిక ఎస్హెచ్జీ మొండి బకాయిలు ఏపీలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే, 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో (2026 జనవరి వరకు) ఆంధ్రప్రదేశ్లో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ రూపంలో మొత్తం రూ.1,84,731 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2021-22లో రూ.30,350 కోట్లు, 2022-23లో రూ.36,439 కోట్లు, 2023-24లో రూ.40,900 కోట్లు, 2024-25లో రూ.41,981 కోట్లు వసూలయ్యాయని వివరించారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు రూ.35,061 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
వివరాలు
నాలుగేళ్లలో భారీగా ఫ్లైయాష్ ఉత్పత్తి
ఇక విద్యుత్ రంగానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి గత నాలుగేళ్లలో భారీగా ఫ్లైయాష్ ఉత్పత్తి అయినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11,905 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ల నుంచి 637 లక్షల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అయినట్లు చెప్పారు. లోక్సభలో విశాఖపట్నం తెదేపా ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలతో సమాధానం ఇచ్చారు.