Campbell Wilson: ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) 'క్యాంప్బెల్ విల్సన్' తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక సమయంలో జరిగింది. తాజా సమాచారం ప్రకారం కొత్త సీఈవో నియామకం జరిగేవరకు విల్సన్ తన బాధ్యతలను కొనసాగిస్తారు. గతవారం బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. అవసరమైతే కొత్త సీఈవో వచ్చే వరకు, సెప్టెంబర్ వరకు కూడా ఆయన పదవిలో ఉండే అవకాశం ఉందని ఇన్ సైడర్లు వెల్లడించారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోకి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత 2022సెప్టెంబర్లో విల్సన్ సీఈవో బాధ్యతలు స్వీకరించారు. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాత కొనసాగించేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.
వివరాలు
తీవ్ర ఒత్తిడిలో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా తీవ్ర నిర్వహణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఖర్చులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానాలను మార్గం మార్చాల్సి రావడం వ్యయాలను మరింత పెంచింది. కొత్త విమానాల డెలివరీలో జాప్యం కూడా విస్తరణ ప్రణాళికలకు ఆటంకంగా ఉంది. గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఘోర AI 171 బోయింగ్ డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం సంస్థపై ఇంకా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆ ఘటనలో 241 మంది ప్రయాణికులు మరణించారు. సంస్థ ప్రతిష్ట, నిర్వహణ దృష్ట్యా తీవ్ర అవమానం ఎదుర్కొంది. ప్రస్తుతం విల్సన్ రాజీనామాపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. కొత్త సీఈవో నియామకం కోసం అన్వేషణ ఇప్పటికే చివరి దశలో ఉంది.