Air India : గాల్లోనే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ సున్నా.. ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్కు సంబంధించిన ఆయిల్ ప్రెజర్ తగ్గిపోయింది. క్షణాల్లోనే ఆయిల్ ప్రెజర్ సున్నాస్థాయికి చేరింది.పరిస్థితిని వెంటనే గుర్తించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైనచర్యలు తీసుకుని విమానాన్నిఢిల్లీ ఎయిర్పోర్టులో సురక్షితంగా దింపారు. సోమవారం తెల్లవారుజామున 3:20గంటల సమయంలో బోయింగ్ 777-337 ER మోడల్కుచెందిన ఎయిర్ ఇండియా విమానం AI887 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని కుడివైపు ఇంజిన్లో ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గినట్లు పైలట్లు గుర్తించారు. ఆతర్వాత కొద్దికాలంలోనే ఆయిల్ ప్రెజర్ పూర్తిగా సున్నాకి పడిపోయింది.దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
వివరాలు
స్పందించిన ఎయిర్ ఇండియా సంస్థ
వారి సూచనల మేరకు విమానాన్ని తిరిగి ఢిల్లీ వైపుగా మళ్లించారు. అనంతరం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ అధికారికంగా స్పందించింది. డిసెంబర్ 22న ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన AI887 విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా,టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ఢిల్లీకి తీసుకురావాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని,ఈఘటనలో ప్రయాణికులు లేదా సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు.ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు కూడా వెల్లడించారు. మరోవైపు,గాల్లోనే సమస్య తలెత్తడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్ల సమయోచిత చర్యలతో విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.