MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు.
ఏడో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 1,18,070 ఓట్లు పొందారు. మొత్తం 2,41,873 ఓట్లు పోలైనప్పటికీ, ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 21,577 ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి.
50 శాతానికి పైగా ఓట్లు సాధించినందున ఆలపాటిని అధికారికంగా విజేతగా ప్రకటించారు.
తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన ఓట్ల సంఖ్య 1,45,057కి చేరుకుంది.
సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు మాత్రమే పొందారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆలపాటి రాజేంద్ర 82,320 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఆయనకు వచ్చాయి.
వివరాలు
ప్రతి రౌండులోనూ ఆలపాటి ఆధిక్యం
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓట్ల లెక్కింపు మొదటి నుంచి ప్రతి రౌండులోనూ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.
గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొత్తం 2,41,873ఓట్లు పోలవడంతో లెక్కింపు ప్రక్రియ 9రౌండ్లలో పూర్తయ్యింది.ఈఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరగడంతో పాటు పోటీలో 25మంది అభ్యర్థులు ఉండటంతో లెక్కింపు మరింత సమయం తీసుకుంది.
ప్రతిపక్ష అభ్యర్థుల్లో కేవలం సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే గణనీయమైన ఓట్లు పొందగలిగారు,మిగతా అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సంపాదించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రానికి తెదేపా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరై ఆలపాటిరాజేంద్రకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.