Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈ వార్తాకథనం ఏంటి
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Details
ఈనెల 18వ తేదీ వరకు ఆర్జిత సేవలు
ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైలంలో అన్ని ఆర్జిత, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీఐపీలు సహా సాధారణ భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు నిర్ణీత సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.