Amaravati: కాకినాడ నుంచి అమరావతికి ఏపీ మారిటైం బోర్డు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రధాన కార్యాలయంగా అమరావతిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం కాకినాడలో ఉన్న ఏపీ మారిటైం బోర్డు కార్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ పోర్ట్స్ను అమరావతికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. కార్యాలయాల మార్పిడికి అవసరమైన సిబ్బంది, రికార్డులు, ఇతర ఆస్తులను అమరావతికి తరలించే ప్రక్రియను చేపట్టాలని ఏపీ మారిటైం బోర్డు సీఈవో, పోర్టుల డైరెక్టర్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పరిధిలోని సిబ్బంది జీతభత్యాలను ఇకపై మంగళగిరిలోని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ద్వారా డ్రా చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
క్రెడిట్ గ్యారంటీ ఫండ్కు రూ.10 కోట్ల ఆమోదం
ఇప్పటి వరకు ఏపీ మారిటైం బోర్డు, డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ను కాకినాడలో ఏర్పాటు చేస్తూ 2019 నవంబర్లో జారీ చేసిన జీవో నంబర్ 101ను ప్రభుత్వం సవరించింది. తాజా ఉత్తర్వులతో అమరావతిని అధికారిక ప్రధాన కార్యాలయంగా ప్రకటించింది. మరోవైపు,సూక్ష్మ,చిన్న పరిశ్రమలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఏపీ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు'కింద కార్పస్ నిధి కోసం రూ.10 కోట్ల విడుదలకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చర్యతో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాల మంజూరులో మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.