Loading...
Naimisha Pradhan: నీట్‌ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తెపై ట్రోల్స్‌.. ఖాతాలు డీయాక్టివేట్
నీట్‌ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తెపై ట్రోల్స్‌.. ఖాతాలు డీయాక్టివేట్

Naimisha Pradhan: నీట్‌ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తెపై ట్రోల్స్‌.. ఖాతాలు డీయాక్టివేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ (NEET) ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. సీజేపీతో పాటు పలువురు విపక్ష పార్టీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్‌ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ముఖ్యంగా ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో, ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలను డీయాక్టివేట్‌ చేసినట్లు సమాచారం.

వివరాలు 

భారత్‌లో ఎల్‌ఎల్‌బీ.. అమెరికాలో ఎల్‌ఎల్‌ఎం

ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్‌ భారత్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అనంతరం అమెరికాలోని మాసాచుసెట్స్‌లో ఉన్న ఒక విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు.

ప్రస్తుతం ఆమె యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరంలో సీనియర్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

విదేశీ చదువుపై విమర్శలు

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో, నైమిషా విదేశాల్లో చదివిన విషయం సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రే తన కుమార్తెను విదేశాల్లో చదివించడం దేశ విద్యా వ్యవస్థపై ఆయనకు విశ్వాసం లేదనే సంకేతమని కొందరు పోస్టులు చేశారు.

ఈ విమర్శలు పెరగడంతో నైమిషా తన సోషల్‌ మీడియా ఖాతాలను డీయాక్టివేట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం సరైనదేనా?

మరోవైపు, రాజకీయ వివాదాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ప్రభుత్వ విధానాలు, ప్రజాప్రతినిధుల నిర్ణయాలపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ, వారి కుటుంబ సభ్యులను ఈ వివాదాల్లోకి లాగడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.

రాహుల్‌ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్‌ విమర్శలు

ఇదిలా ఉండగా, జంతర్‌ మంతర్‌లో కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు.

విద్యార్థుల ఆందోళనలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

నీట్‌ వ్యవహారంతో పాటు సంబంధిత అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT