Page Loader
Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!
తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తును ప్రారంభించింది. లబ్ధిదారుల గణన, ఆర్థిక భారం లెక్కలను సిద్ధం చేస్తోంది. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా, ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించడంతో, లబ్ధిదారులకు ఒక సంవత్సరం పాటు ఒక ఏడాది పథకం అమలు కానట్లే . అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

వివరాలు 

పథకం అమలు విధానం 

ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చిన కూటమి ప్రభుత్వం, వైసీపీ హయాంలో రూ. 15,000 నుంచి పాఠశాల నిర్వహణ ఖర్చు పేరుతో కోత విధించిన విధానాన్ని సమీక్షిస్తోంది. వైసీపీ ప్రభుత్వం మొదట రూ. 14,000, ఆపై రూ. 13,000 మాత్రమే అందించగా, కూటమి నేతలు ఎలాంటి కోతలు లేకుండా రూ. 15,000 పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని 2024లో అమలు చేయకుండా, 2025 జూన్‌లో ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

పథకం కోసం ఖర్చు - లెక్కలు 

ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి అనుగుణంగా, అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈ పథకం అమలు ప్రక్రియ నాలుగు సంవత్సరాలకు పరిమితమవుతుంది, దీని వల్ల లబ్ధిదారులకు ఒక సంవత్సరం నిధులు కోత పడే అవకాశం ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ పథకం అమలుకు రూ. 10,300 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాధమికంగా అంచనా. విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయింపునకు కసరత్తు జరుగుతోంది.

వివరాలు 

విధి విధానాలు - అర్హత నిబంధనలు 

ప్రభుత్వం పథకానికి సంబంధించిన విధి విధానాలపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి మార్గదర్శకాలను సమీక్షించనుంది. గతంలో పథకానికి అనర్హులుగా ప్రకటించిన వారు: ఆదాయపన్ను చెల్లించేవారు తెల్ల రేషన్ కార్డు లేనివారు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు కారు కలిగి ఉన్న కుటుంబాలు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నివసించే అర్బన్ కుటుంబాలు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిబంధనలను తొలగిస్తుందా, కొనసాగిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు కలిగి ఉండటం వంటి నిబంధనలను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు అవే నిబంధనలు కొనసాగిస్తారా? లేక మినహాయింపులు ఇస్తారా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

వివరాలు 

తల్లికి వందనం - లబ్ధిదారుల ఎదురుచూపు 

ప్రభుత్వం తల్లికి వందనం నిధులు 2025 జూన్‌లో ఖాతాల్లో జమ అవుతాయని ప్రకటించినా, అర్హత నిబంధనలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.