Page Loader
కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 
కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి

కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 05, 2023
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కుమారుడి అరెస్టును అడ్డుకునేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. ఆమె కొడుకును బలవంతంగా కారులో తరలిస్తున్నారనే కారణంగా బానెట్‌పైకి దూసుకెళ్లింది. సదరు మహిళ కారు బానెట్ పై ఉండగానే పోలీసులు కారును అలాగే ముందుకు కదిలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నార్సింగ్‌పుర్‌ పరిధిలోని గొటెగావ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గొటెగావ్‌లోని కొందరు వ్యక్తులు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

DETAILS

ప్రజాగ్రహం పెల్లుబీకడంతో ముగ్గురు పోలీసులు సస్పెండ్

దీంతో సదరు కాలనీకి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దిరిలో ఆ మహిళ కుమారుడు ఉన్నాడు. పూలు అమ్ముకొని బతికే ఆమె, కుమారుడి అరెస్టుతో ఆందోళనకు గరైంది. దీంతో వేగంగా పరుగెత్తుకొచ్చి కారు బానెట్‌పైకి దూకింది. తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అతడిని వదిలేయాలని అభ్యర్థించింది. పోలీసులు ఆమె మాటను అంగీకరించలేదు. దీంతో చేసేదేం లేక కారు బానెట్‌పైకి దూసుకెళ్లింది.అర కి.మీ దూరంలో ఉన్న ఠాణాకు పోలీసులు కారు ఆపకుండా అలాగే తీసుకెళ్లారు. స్థానికులు ఈ దృశ్యాలను ఫోన్‌ల్లో వీడియో తీశారు. అది కాస్త వైరల్ గా మారి ప్రజాగ్రహం పెల్లుబీకింది. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు.