Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్' ఉత్పత్తుల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతలో 14 స్టాళ్లు, రెండో విడతలో మరో 36 స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇప్పటికే సచివాలయం, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాల్లో మహిళా ఉత్పత్తుల స్టాళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ వీటిని ప్రారంభించి, రైలు ప్రయాణికులకు తెలంగాణ ఇంటి వంటల రుచులు పరిచయం చేయడంతో పాటు, ఇక్కడి చేనేత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మహిళా స్టాళ్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్యాదేవరాజన్, రైల్వేశాఖ అధికారులతో చర్చలు జరిపి, అనుమతి పొందారు.
Details
ప్రాథమికంగా కొన్ని స్టేషన్లలో ఉత్పత్తుల విభజన
సికింద్రాబాద్: పిండివంటల ఉత్పత్తులు - ఖమ్మం: సకినాలు, లడ్డూలు, కారప్పూస - సిర్పూర్: సకినాలు, మురుకులు, ఇతర ఉత్పత్తులు
భద్రాచలం: పచ్చళ్లు- వరంగల్: చిరుధాన్యాలు - కరీంనగర్: చిరుధాన్యాల ఉత్పత్తులు
ఘనాపూర్: చేతి ఉత్పత్తులు - శంకర్పల్లి: జూట్, క్లాత్ బ్యాగులు - వికారాబాద్: గాజులు, పూసలు, హారాలు
చర్లపల్లి: మట్టి కప్పులు, నీళ్లసీసాలు, కడాయిలు - జనగామ: టవళ్లు, చేతిరుమాళ్లు - పోచంపల్లి: చేనేత ఉత్పత్తులు
Details
తెలంగాణ ఉత్పత్తులకు జాతీయ గుర్తింపు
రైల్వే స్టేషన్లలో మహిళా ఉత్పత్తుల స్టాళ్లు ప్రారంభించడం ద్వారా తెలంగాణ మహిళా సంఘాలు, వాటి ఉత్పత్తులకు దేశవ్యాప్త గుర్తింపు లభించే అవకాశం ఉందని సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్ తెలిపారు.
రైలు ప్రయాణికుల ద్వారా వివిధ రాష్ట్రాలకు ఈ ఉత్పత్తుల గురించి ప్రచారం కూడా జరుగుతుందన్నారు.
తద్వారా మహిళా సంఘాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందన్నారు.