AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల.. మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువరించింది. ఈ రోజు నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఇప్పటివరకు 26గా ఉన్న జిల్లాల సంఖ్య 28కిపెరిగింది. ప్రారంభంలో మదనపల్లిని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించినప్పటికీ, ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చింది. ప్రజలకు వేగంగా పాలన అందించడం,మెరుగైన పరిపాలన సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు,పలు మండలాల సరిహద్దుల్లో మార్పులు చేసింది.
వివరాలు
సరిహద్దులకు సంబంధించి తుది ప్రకటన
కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లలో అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, జిల్లాల సరిహద్దులకు సంబంధించిన తుది ప్రకటనను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా ఏర్పాటైన ఐదింటితో కలిపి వాటి సంఖ్య 82కు చేరింది. ఇదే సమయంలో మండలాల సంఖ్య 679 నుంచి 681కి పెరిగింది.
వివరాలు
పెనుగొండ వాసవీ పెనుగొండగా పేరు మార్పు
పెనుగొండ మండలానికి వాసవీ పెనుగొండగా పేరు మార్చారు. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్కు బదిలీ చేశారు. అలాగే సామర్లకోటను కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్కు మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని మండలాల పరిధిలో మార్పులు చేపట్టారు. గూడురు నియోజవర్గానికి చెందిన మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోకి చేర్చారు. ఈ మార్పులన్నింటిపై 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటికి అనుగుణంగా ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది.