Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ లేకుండా చూసేందుకు చేపడుతున్న వరద నియంత్రణ చర్యలలో భాగంగా, ఉండవల్లి గ్రామం వద్ద 'పంపింగ్ స్టేషన్-2' నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టును అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) పర్యవేక్షణలో జోన్-8 ప్రాంతంలో నిర్మించనున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరదల సమయంలో సుమారు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి పంపించేలా డిజైన్ చేశారు. వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
వివరాలు
MEIL సంస్థకే ప్రాజెక్ట్ బాధ్యతలు
టెండర్లలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (MEIL) సంస్థ L1 బిడ్గా నిలవడంతో.. ADCL ఈ సంస్థకే ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.443.76 కోట్లు ఖర్చుతో ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో కేవలం నిర్మాణమే కాకుండా, సర్వే, డిజైన్,నిర్మాణం పూర్తైన తర్వాత 15 ఏళ్ల పాటు నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను కూడా MEIL సంస్థ భరిస్తుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఆమోదం తెలిపింది. దీని వల్ల, వరద నియంత్రణ వ్యవస్థ దీర్ఘకాలికంగా సక్రమంగా పనిచేయగలదని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA), ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో సమీకరించనున్నారు.
వివరాలు
వరదనీటిని సురక్షితంగా మళ్లించేందుకు బలమైన వ్యవస్థ ఏర్పాటు
రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ నిధులను వినియోగిస్తారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, పనులు ఆలస్యం కాకుండా తక్షణమే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. అమరావతిలో వరద నియంత్రణకు ఇది అత్యంత కీలక ప్రాజెక్ట్ అని అధికారులు భావిస్తున్నారు. పంపింగ్ స్టేషన్-2 పూర్తి అయిన తర్వాత, వర్షాకాలంలో నీటి ముంపు సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. కృష్ణా నదిలోని వరదనీటిని సురక్షితంగా మళ్లించేందుకు బలమైన వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. రాజధాని నిర్మాణంలో ఇప్పటికే కొనసాగుతున్న మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్ట్ మరింత మద్దతు అందించనుంది.