LOADING...
Andhra Pradesh milk tragedy explained:  రాజమహేంద్రవరం పాల కలకలం: అన్యూరియా అసలు ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరం?
అన్యూరియా అసలు ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరం?

Andhra Pradesh milk tragedy explained:  రాజమహేంద్రవరం పాల కలకలం: అన్యూరియా అసలు ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరం?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ నెల 15వ తేదీ ప్రాంతంలో ఒకే సరఫరాదారు ఇచ్చిన పాలు తాగిన కుటుంబాల్లో ఒక్కసారిగా వాంతులు, అస్వస్థత కేసులు బయటపడగా, పరిస్థితి క్రమంగా తీవ్రమైంది. ఇప్పటివరకు 70 ఏళ్లకు పైబడిన నలుగురు ప్రాణాలు కోల్పోగా,మరో 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరికి మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ పి.ఎస్. వీరపాండియన్ మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు వెంటిలేటర్‌పై, ఇద్దరు డయాలిసిస్‌పై, మరికొందరు వెంటిలేటర్-డయాలిసిస్ రెండింటిపై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

వివరాలు 

కిడ్నీలు పనిచేయడం ఆగిపోయినట్టు చెప్పే తీవ్రమైన హెచ్చరిక

ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తం 110 కుటుంబాలకు చెందిన 315 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా, ఇద్దరిలో క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం కొత్త కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో "అన్యూరియా"అనే వైద్యపదం ప్రాధాన్యం పొందింది. అన్యూరియా అంటే 24గంటల్లో 100మిల్లీలీటర్ల కంటే తక్కువ మూత్రం రావడం. ఇది ప్రత్యేకమైన వ్యాధి కాదు, కానీ కిడ్నీలు పనిచేయడం ఆగిపోయినట్టు చెప్పే తీవ్రమైన హెచ్చరిక సంకేతం. సాధారణంగా మూత్రపిండాలు రక్తంలో ఉన్న వ్యర్థాలను వడకట్టి బయటకు పంపిస్తాయి. అవి ఆగిపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి యూరీమియా అనే పరిస్థితి వస్తుంది. దాంతో వాపులు,శ్వాసలో ఇబ్బందులు,ఇతర అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

బాధ్యులపై కఠిన చర్యలు

వైద్యుల అనుమానం ఏమిటంటే... కల్తీ పాలలో ఉన్న విషపదార్థం నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపి, వాటి పనితీరును దెబ్బతీసి ఉండొచ్చని చెబుతున్నారు. మొదట ఈ ప్రాంత ప్రజల్లో వాంతులు, విరేచనాలు కనిపించాయి. కానీ ప్రధాన హెచ్చరిక లక్షణం మూత్రం తగ్గిపోవడమే. కాళ్లలో, ముఖంలో వాపు, తలనిర్భందం, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు తాగడం, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవడం, తెలియని వనరుల నుంచి ఆహారం-పానీయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఈ ఘటన ప్రజారోగ్యంపై పెద్ద పాఠంగా మారింది. అధికారులు కల్తీ పాల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement