NITI Aayog: నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం లభించింది. ఈ నివేదికను నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసింది. ఈ సూచీలో మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒకే గ్రూప్గా తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాలను ఒడిశా, గోవా, ఝార్ఖండ్ రాష్ట్రాలు దక్కించుకున్నాయి. మరోవైపు చివరి మూడు స్థానాల్లో పంజాబ్,ఆంధ్రప్రదేశ్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిలిచాయి.
వివరాలు
అప్పుల సుస్థిరత విభాగంలో కేవలం 4.2 మార్కులు మాత్రమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23.1 స్కోర్తో 17వ స్థానంలో నిలిచింది. వివిధ సూచికల ఆధారంగా రాష్ట్రానికి వచ్చిన మార్కుల్లో ఖర్చుల నాణ్యత (క్వాలిటీ ఎక్స్పెండిచర్) విభాగంలో 43.1, ఆదాయ సమీకరణ విభాగంలో 21.7, డెట్ ఇండెక్స్ విభాగంలో 36.6 మార్కులు లభించాయి. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ విభాగంలో రాష్ట్రానికి 9.9 మార్కులు మాత్రమే వచ్చాయి. అలాగే అప్పుల సుస్థిరత విభాగంలో కేవలం 4.2 మార్కులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆదాయం-వ్యయం మధ్య అసమతౌల్యం నిరంతరం కొనసాగుతున్నట్లు నీతి ఆయోగ్ ఈ నివేదికలో పేర్కొంది.