Kolleru Boundary Changes: కొల్లేరు సరిహద్దుల మార్పులపై కేంద్రానికి రాష్ట్ర లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాల మేర తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కొల్లేరు సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ పంపింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ 48వ సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కోరింది.
వివరాలు
కేంద్ర సాధికార కమిటీకి లేఖ రాసిన అటవీశాఖ ముఖ్య కార్యదర్శి
ప్రస్తుతం ఉన్న సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీనివల్ల శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించి, సరిహద్దుల మార్పుకు కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలని తీర్మానం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి అమల్లో ఉన్న సరిహద్దుల మార్పుపై నిలిపివేత ఆదేశాలను ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కేంద్ర సాధికార కమిటీకి లేఖ రాశారు.