Andhra News: 2,801 ఎకరాల్లో 'స్పేస్ సిటీ'.. మొదటి దశ 571 ఎకరాల్లో స్టార్టప్ యాక్టివేషన్ ప్రాంతం
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, సేవల రంగాలను, అలాగే వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం 15,000 ఎకరాల్లో 'స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా' ను నిర్మించనుంది. స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి సాంకేతికతను ప్రోత్సహించడం,దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ యోజన ప్రధాన లక్ష్యాలు. దీనిని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం స్పేస్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద రాబోయే ఐదేళ్లలో రూ. 25,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టింది.
వివరాలు
దశలవారీ అభివృద్ధి ప్రణాళిక
తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం రౌతుసురమాల ప్రాంతాన్ని స్పేస్ సిటీకి అనుకూలంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటి దశలో 2,801.43 ఎకరాల్లో అంతరిక్ష పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పరిధిలోని స్టార్టప్ యాక్టివేషన్ ఏరియా 571.70 ఎకరాల్లో రూ.140.95 కోట్లు పెట్టి ఆధునిక సదుపాయాలను నిర్మిస్తారు. పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ లక్ష్యం.
వివరాలు
మౌలిక సదుపాయాలు,వాణిజ్య వాతావరణం
స్టార్టప్ యాక్టివేషన్ ఏరియాలో పరిపాలనా భవనాలు, ఇంక్యుబేషన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్ వంటి వసతులను ఏర్పాటు చేస్తారు. ప్రపంచ స్థాయి ప్లగ్ అండ్ ప్లే తరహా సౌకర్యాల ద్వారా సంస్థలను ఆకర్షించాలనే ఆలోచన ఉంది. తిరుపతి సమీపంలోని ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, సెమీకండక్టర్ పరిశ్రమలకు అనుమతులు అందించబడ్డాయి. వాటి సమీపంలో స్పేస్ సిటీని ఏర్పాటు చేయడం ప్రణాళికలో ఉంది.
వివరాలు
కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి
ప్రతిపాదించిన ప్రాంతానికి రవాణా సౌకర్యాలు సమగ్రంగా ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతం జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వే లైన్కు దగ్గరగా ఉంది. ముఖ్య వివరాలు: జాతీయ రహదారి-71 నుండి 3.8 కి.మీ స్టేట్ హైవే-480 నుండి NH-16 వరకు హౌరా-చెన్నై రైల్వే లైన్ లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ 27 కి.మీ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ 14 కి.మీ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం 30 కి.మీ నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు 70 కి.మీ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 50 కి.మీ ఎగుమతులు, దిగుమతులకు అనుగుణంగా కనెక్టివిటీని సులభతరం చేయడం ప్రభుత్వ ఉద్దేశం.
వివరాలు
నీటి, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ వనరులు
స్పేస్ సిటీకి 70 కి.మీ దూరంలోని కండలేరు జలాశయం నుండి నీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమీప పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం రూ. 200 కోట్ల పైపు లైన్ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఇక్కడ హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉంది, దీని ద్వారా సమగ్ర డిజిటల్ కనెక్టివిటీని అందించడం సులభం.