AP Weather Update : ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో వడగాలులు, అకాల వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం,ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వడగాలులు వీచే పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి సమీపంగా లేదా కొంత తక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో, పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించవచ్చు. కొన్ని చోట్ల పగటి వేడి తీవ్రంగా పెరగగా, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉండి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది.
వివరాలు
తీర జిల్లాల్లో వడగాలుల ఎక్కువగా ఉండే సూచనలు
తీర జిల్లాల్లో వడగాలుల రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ పెరుగుతున్న వేడి ప్రభావం ప్రజల ఆరోగ్యం, తాగునీటి అందుబాటు, అలాగే విద్యుత్ వినియోగంపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,బయట పనిచేసే కార్మికులు దీర్ఘకాలం వేడి తాకిడికి గురైతే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఇక మరోవైపు, ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా. ఆంధ్రప్రదేశ్లో కూడా సాధారణం నుంచి అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తాత్కాలికంగా వేడి నుంచి ఉపశమనం ఇచ్చినా, ఆకస్మికంగా లేదా అసమానంగా కురిసే వర్షాలు వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించవచ్చు.
వివరాలు
వడగాలులు, ఆకస్మిక వర్షాలు రెండూ ఎదురయ్యే పరిస్థితి
అధిక ఉష్ణోగ్రతలు,అకాల వర్షాలు పంటల పెరుగుదల, దిగుబడులపై ప్రభావం చూపవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, అరటి, మామిడి వంటి పంటలు ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోవచ్చు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు పెరిగిన వర్షపాతం కలిసిన మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వడగాలులు, ఆకస్మిక వర్షాలు రెండూ ఎదురయ్యే పరిస్థితి ఉండడంతో ప్రజారోగ్యం, నీటి వనరులు, వ్యవసాయంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు అవసరమని స్పష్టం చేశారు.