LOADING...
SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్‌ 15 నుంచి ఇంటింటి సర్వే..!
ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్‌ 15 నుంచి ఇంటింటి సర్వే..!

SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్‌ 15 నుంచి ఇంటింటి సర్వే..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సరిచేసి నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్లకు పైగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ "ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026" ప్రక్రియను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రక్రియకు జూలై 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే యువత కూడా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను ధృవీకరించేందుకు ఎన్నికల శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

వివరాలు 

46,397 మంది బూత్ స్థాయి అధికారులు

మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు 46,397 మంది బూత్ స్థాయి అధికారులు రంగంలోకి దిగనున్నారు. వీరు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల తరఫున నియమితులైన 68,868 మంది బూత్ స్థాయి ప్రతినిధులు కూడా సహకరించనున్నారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తీసివేయడం,కొత్త ఓటర్ల పేర్లు చేర్చడం వంటి అంశాలను పారదర్శకంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి జూన్ 6 నుంచి జూన్ 14 వరకు అధికారులకు శిక్షణ, అవసరమైన దరఖాస్తు పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లు చేపడతారు. అనంతరం జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. జూలై 21న ప్రాథమిక వివరాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ప్రజలు అభ్యంతరాలు తెలియజేయడానికి, కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను అధికారులు సెప్టెంబరు 18 వరకు పరిశీలించి పరిష్కరిస్తారు.

Advertisement

వివరాలు 

సెప్టెంబరు 22న తుది జాబితా

అన్ని మార్పులు పూర్తయిన అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఈవో వివేక్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ బూత్ స్థాయి ప్రతినిధులను నియమించాలని ఆయన సూచించారు. ఎన్నికల సిబ్బందికి సహకరించి ఈ భారీ కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement