Karnataka: పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. దింతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. రెండు నెలల్లో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోది కావడం గమనార్హం. గతంలో కోలార్, బెంగళూరు, శివమొగ్గ జిల్లాల్లోని పాఠశాలల నుంచి ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన చిక్కబళ్లాపూర్ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం దర్యాప్తు కోసం ఒక బృందాన్ని పాఠశాలకు పంపింది. ప్రభుత్వ బృందం విద్యార్థులతో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది.
డిప్యూటీ సీఎం శివకుమార్ వార్నింగ్
శివమొగ్గ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత.. పాఠశాలల్లో పిల్లలతో ఇలాంటి పనులను బలవంతంగా చేయించొద్దని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శివకుమార్ హెచ్చరించారు. అనంతరం శివమొగ్గ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి చర్యలు తగ్గకపోవడం గమనార్హం. పిల్లలతో బలవంతంగా ఇలాంటి పనులు చేయిస్తున్న పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేయడాన్ని నిషేధిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.