AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వనున్నారు. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించి, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సమావేశం అజెండాలో ప్రధాన అంశంగా అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.1,208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జంట గోపురాల ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీనితో పాటు సచివాలయం,శాఖాధిపతుల కార్యాలయాల గోపురాలకు సంబంధించిన ముఖభాగం, అద్దపు పనులకు రూ.2,540 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.798 కోట్లు ఖర్చు ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
వివరాలు
రైతులకు కౌలు పెంపుపై చర్చ
ఇక పలు విద్యా, ఆర్థిక సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు మెట్ట భూమికి సంవత్సరానికి రూ.40,000, జరీబు భూమికి రూ.60,000 చొప్పున కౌలు పెంపుపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది.