Page Loader
Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 
పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా ఉండేందుకు ఇంధన శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారానికే విద్యుత్‌ డిమాండ్‌ 242.35 మిలియన్‌ యూనిట్లకు(ఎంయూ) చేరుకుంది. వేసవి ఆరంభంలోనే డిమాండ్‌ నియంత్రణ కోసం రోజుకు 10 ఎంయూల విద్యుత్‌ను మార్కెట్‌ ద్వారా డిస్కంలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వినియోగం సుమారు 9 ఎంయూల మేర పెరిగింది. గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లుగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు, ఈ నెల 17న అది 12,726 మెగావాట్లకు చేరినట్లు గుర్తించారు. వచ్చే మూడు నెలల్లో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 259 ఎంయూలకు పెరిగే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

వివరాలు 

స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్‌

ఫిబ్రవరిలో పోల్చితే వినియోగం సుమారు 4 శాతం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం 230 ఎంయూల వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయవచ్చు. అదనంగా అవసరమైన 30 ఎంయూలను వివిధ మార్గాల్లో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

వివరాలు 

హరియాణా,పంజాబ్‌ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌

హిందుజా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చేందుకు కోల్‌ ఇండియా నుంచి బొగ్గు సరఫరా కోసం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చర్యతో మరో 500 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్వాపింగ్‌ విధానం ద్వారా హరియాణా,పంజాబ్‌ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. డిస్కంలు సెంబ్‌కార్ప్‌తో 625 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి,ఇది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.