Ap Rains : ఏపీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.. గంగపుత్రులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఈ మేరకు గంగపుత్రులు, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోర్ట్ ప్రాంతాలు విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పరిధిలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.
శుక్రవారం తీరం దాటే అవకాశం
ఈ క్రమంలోనే తీవ్ర వాయుగుండం శుక్రవారం పశ్చిమ బెంగాల్ తీరం, మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.