Loading...
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌..? రేసులో అశోక్‌ గెహ్లాట్‌ సహా ముగ్గురు
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌..? రేసులో అశోక్‌ గెహ్లాట్‌ సహా ముగ్గురు

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌..? రేసులో అశోక్‌ గెహ్లాట్‌ సహా ముగ్గురు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మార్పుపై పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుత ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సుమారు పది నెలల పాటు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఆమె స్థానంలో కొత్త నేతను నియమించే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ పదవికి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గెహ్లాట్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, శక్తిసింహ్‌ గోహిల్‌ పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, కొత్త ఇంఛార్జ్‌ ఎంపికపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.

వివరాలు 

తాత్కాలిక ఇంఛార్జ్‌.. లేదా పూర్తిస్థాయి బాధ్యతలు?

తెలంగాణలో పార్టీ రాష్ట్ర వ్యవహారాలను సమన్వయం చేయడంతో పాటు సంస్థాగతంగా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే బాధ్యతలను కొత్త ఇంఛార్జ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మీనాక్షి నటరాజన్‌ దీర్ఘకాలిక సెలవు తీసుకుంటే.. తెలంగాణకు తాత్కాలిక ఇంఛార్జ్‌ను నియమించాలా? లేక పూర్తిస్థాయి కొత్త ఇంఛార్జ్‌ను నియమించాలా? అనే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాజకీయ, సంస్థాగత వ్యవహారాల్లో అనుభవం ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన గెహ్లాట్‌కు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది.

వివరాలు 

2025 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన మీనాక్షి

మరోవైపు ముకుల్‌ వాస్నిక్‌, శక్తిసింహ్‌ గోహిల్‌ కూడా కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలుగా ఉన్నారు. దీంతో తుది ఎంపికపై ఆసక్తి నెలకొంది.

అధిష్ఠానం నిర్ణయం వెలువడిన తర్వాతే తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జ్‌పై స్పష్టత రానుంది.

మీనాక్షి నటరాజన్‌ 2025 ఫిబ్రవరి 14న తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహించిన దీపాదాస్‌ మున్షీ స్థానంలో ఆమెను నియమించారు.

తెలంగాణ రాజకీయ పరిణామాలపై అప్పటికే అవగాహన ఉన్న నటరాజన్‌..2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తరఫున ఏఐసీసీ పరిశీలకురాలిగానూ పనిచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ముందుగానే అనుభవం ఉండటం..రాష్ట్ర ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి దోహదపడింది.

ADVERTISEMENT

వివరాలు 

2009లో లోక్‌సభ ఎన్నికల్లో విజయం

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధినాయకత్వంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. రాష్ట్ర వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేవారని పార్టీ నేతలు చెబుతుంటారు.

మీనాక్షి నటరాజన్‌ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో ఆమె 30 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సన్నిహితంగా పనిచేసిన నేతగా పార్టీలో గుర్తింపు పొందారు.

ADVERTISEMENT

వివరాలు 

రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణతో వివాదం

ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు మీనాక్షి నటరాజన్‌ ప్రయత్నించినప్పటికీ.. తృటిలో అవకాశం చేజారింది.

ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం తీవ్ర వివాదానికి దారితీసింది.

సమర్పించిన అఫిడవిట్‌లో తెలంగాణకు సంబంధించిన ఒక కేసు వివరాలను వెల్లడించలేదన్న ఆరోపణలతో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆమె నామినేషన్‌ను రద్దు చేశారు.

దీంతో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.

ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించిన కాంగ్రెస్‌.. బీజేపీ సీటును చోరీ చేసిందని విమర్శించింది.

ఈ అంశంపై మీనాక్షి నటరాజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

ADVERTISEMENT