Assam: అస్సాంలో దూసుకుపోతున్న బీజేపీ కూటమి.. సీఎం హిమంత ముందంజ
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. తాజా లెక్కల ప్రకారం ఆ కూటమి సుమారు 93 స్థానాల్లో ముందంజలో ఉంది. జాలుక్బరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు చెందిన 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నాగావ్ జిల్లాలో మూడు ప్రదేశాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నారు. కోక్రాజార్, టిన్సుకియా, జోర్హాట్ పట్టణాల్లో కూడా కౌంటింగ్ కొనసాగుతోంది.
వివరాలు
మెజారిటీ వైపు బీజేపీ
మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సుమారు 85.96 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ప్రస్తుతం 11 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. జోర్హాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితాల ధోరణిని పరిశీలిస్తే బీజేపీ ఇప్పటికే మెజారిటీ గీతను దాటింది. దీంతో ఆ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతున్నది.