ముంబై బీచ్లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ
ముంబైలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది. తన భర్తతో కలిసి బాంద్రా బ్యాండ్స్టాండ్ వద్ద ఫొటోలు దిగుతున్న 32ఏళ్ల జ్యోతి సోనార్ అనే మహిళ భారీ అలలకు కొట్టుకుపోయింది. జ్యోతి తన భర్తతో కలిసి ఫొటోలు దిగుతున్న క్రమంలో రాకాసి అల ఒక్కసారిగా మీదపడటంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది. సెల్ ఫోన్లో ఫొటోలు తీస్తున్న తన పిల్లలు చూస్తుండగానే ఆమె మునిగిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఆమె కనిపించకుండాపోయింది. జ్యోతి భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. కన్న తల్లి కొట్టుకుపోయిన దృశ్యాన్ని చూసిన ఆ పిల్లలు 'మమ్మీ మమ్మీ' బోరున విలపించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్
జ్యోతిని ముఖేష్ అనే వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశాడు. ఆమెను చీర పట్టుకొని లాగే ప్రయత్నం చేశాడు. ప్రవాహం బలంగా ఉండంటతో ముఖేష్ సైతం ప్రవాహంలో మునిగిపోయాడు. దీంతో పక్కన ఉన్న కొందరు అతని కాలును పట్టుకొని వెనక్కి లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంద్రా కోట వద్ద సముద్రంలో మునిగిపోయిన జ్యోతి సోనార్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. జ్యోతి సోనార్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని, మృతదేహాన్ని పౌర నిర్వహణలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని అధికారి తెలిపారు.