Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది అనంత్ దేహద్రాయ్ను 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మోయిత్రా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో 2పేజీల లేఖను పోస్ట్ చేశారు. వారం క్రితం క్యాష్ ఫర్ క్వెరీ కేసులో నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని లోక్సభ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. తాను నవంబర్ 5న హాజరవుతానని ప్యానెల్ను మోయిత్రా అభ్యర్థించారు. అందుకు ప్యానెల్ ఒప్పుకోలేదు. దీంతో తాను 2న తేదీన విచారణకు హాజరవుతున్నట్లు ట్విట్టర్ ద్వారా మోయిత్రా వెల్లడించారు.
క్రాస్ ఎగ్జామిన్ను రికార్డ్స్లో పొందుపర్చాలి: మోయిత్రా
లోక్సభ ఎథిక్స్ కమిటీ తన సమన్లను మీడియాకు విడుదల చేస్తే సరిపోతుందని భావించిన నేపథ్యంలో, విచారణకు వస్తున్నట్లు తాను కూడా తన లేఖను ఒకరోజు ముందు విడుదల చేయడం సమంజసంగా భావిస్తున్నట్లు ట్విట్టర్లో మోయిత్రా రాసుకొచ్చారు. న్యాయవాది దేహద్రాయ్, వ్యాపారవేత్త హీరానందానీలను క్రాస్ ఎగ్జామిన్ను రికార్డ్స్లో పొందుపర్చాలని మోయిత్రా పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ను అనుమతించడం లేదా అనుమతించకూడదనే కమిటీ నిర్ణయాన్ని రాతపూర్వకంగా లోక్ సభ రికార్డ్స్లో ఉంచాలని తాను ప్యాలెన్ను అభ్యర్థిస్తున్నట్లు మోయిత్రా వివరించారు.