LOADING...
Mamata Banerjee: మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్
మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్

Mamata Banerjee: మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రి బెల్‌ వ్యూ హాస్పిటల్‌ సీఈవోకు ఆమె హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఉన్న ఓ ఆడియో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోనార్‌పుర్‌లో అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగిన అనంతరం ఆయనను చికిత్స కోసం బెల్‌ వ్యూ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఆయనను డిశ్చార్జ్‌ చేయాలని బీజేపీ నేతలు, అలాగే ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఆస్పత్రిపై ఒత్తిడి తీసుకొచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు.

వివరాలు

ఆస్పత్రే బాధ్యత వహించాలి

తన మేనల్లుడికి ఏదైనా జరిగితే దానికి ఆస్పత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బెల్‌ వ్యూ ఆస్పత్రి సీఈవో ప్రదీప్‌ టాండన్‌తో మమత మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో బయటకు వచ్చింది. అందులో టాండన్‌.. మీరు తప్పు చేశారు. మేము మీకు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని మేము గుర్తుంచుకుంటాం. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇప్పుడు భాజపా అధికారంలో ఉంది. రేపు వారు అధికారంలో లేకపోతే మేం చేయాల్సింది చేస్తామని ఆమె వ్యాఖ్యానించినట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం అభిషేక్‌ బెనర్జీకి ఇంటి వద్దే వైద్య చికిత్స అందిస్తున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.

Advertisement