Sonia Gandhi: రాజ్యాంగంపై దాడి.. డీలిమిటేషన్పై సోనియా గాంధీ ఘాటు విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా రిజర్వేషన్ల బిల్లుకంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్సభ స్థానాల పెంపు కోసం చేపడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియను ఆమె రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అలాగే ఎన్నికల సమయంలో 'నారీ శక్తి వందనం అధినియమ్' సవరణ బిల్లును తీసుకురావడంపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై కేంద్రం ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ విషయంపై ప్రతిపక్షం ఇప్పటికే మూడు సార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినప్పటికీ అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు.
వివరాలు
ప్రతిపాదనను ప్రతిపక్షం వ్యతిరేకించడం లేదు
దానికి బదులుగా సంపాదకీయాలు రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో 'నా మాటే నెగ్గాలి' అన్న ధోరణిలో ప్రధాని వ్యవహరించడం బాధాకరం. ఎన్నికల సమయంలో రాజకీయ లాభం కోసమే ఈ అంశాలను పార్లమెంట్లో చర్చకు తెస్తున్నారంటూ ఆమె విమర్శించారు. అంతేకాక లోక్సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రతిపక్షం వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
డీలిమిటేషన్ చేయడం సమంజసం కాదు
అయితే 2027 జనాభా లెక్కలకు ముందు చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రం వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సరైన, స్పష్టమైన సమాచారం లేకుండా డీలిమిటేషన్ చేయడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 'నారీ శక్తి వందనం అధినియమ్' సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో తీసుకురావాలని కేంద్రాన్ని ఆమె కోరారు.