S. Jaishankar: వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆగాలి: అమెరికాకు భారత్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులను భారతదేశం మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడి భారత ఆందోళనను వ్యక్తం చేశారు. దాడుల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర నిరసన తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం మార్కో రూబియోతో మాట్లాడినట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడం పట్ల భారత్ తరఫున అధికారికంగా నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు ఏ మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.
వివరాలు
ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవే: ఇరాన్
ఇదే అంశంపై దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జేసన్ మీక్స్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. భారతీయులు ఉన్న నౌకలపై దాడులకు ఇరానే బాధ్యత వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో ఒక ప్రకటన విడుదల చేసింది. 'భారతీయులు ఉన్న నౌకలపై దాడులకు సంబంధించి ట్రంప్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. గత వారం రోజుల్లోనే మూడు నౌకలపై అమెరికా దాడులు జరిపి ముగ్గురు అమాయక భారతీయ నావికుల మరణానికి కారణమైందని ఇరాన్ పేర్కొంది.