మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం
వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు. వాస్తవానికి శుక్రవారం ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తన తల్లికి అనారోగ్యం వల్లే రాలేకపోతున్నానని సీబీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. సమయంలో తక్కువగా ఉండటం న్యాయవాదులు ద్వారా లేఖను పంపుతున్నట్లు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించినట్లు, అందుకోసం తాను పులివెందులకు వెళ్లాల్సి వస్తోందని అవినాష్ లేఖలో చెప్పారు.
ఈ వారంలో రెండోసారి గైర్హాజరు
వాస్తవానికి ఈ నెల 16న కూడా అవినాష్రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ముందుస్తు షెడ్యూల్ను సాకుగా చూపుతూ విచారణకు రాలేదు. ఈ క్రమంలో ఆరోజు 19వ తేదీన విచారణకు రావాలని సీబీఐ అధికారులు మళ్లీ సమన్లు జారీ చేశారు. దీంతో తాజాగా మరోసారి గైర్జాజరు కావడంపై సీబీఐ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినాష్ దర్యాప్తు నుంచి తప్పించుకుంటున్నారని, అతను స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదిస్తోంది. అయితే అవినాష్ రెడ్డి గైర్హాజరుపై ఆయన తరఫు లాయర్లు మాట్లాడారు. అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీస్కు బయలుదేరిన తర్వాత మార్గమధ్యలో తన తల్లి అనారోగ్యం విషయం తెలిసిందని చెప్పారు.