Page Loader
Ayodhya's Ram temple trust:  ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?  
ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?

Ayodhya's Ram temple trust:  ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ఏకంగా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి విశేష సహకారం అందించింది. దేశంలో మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరిగినందున, ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరిందని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 2020 ఫిబ్రవరి 5 నుండి 2025 ఫిబ్రవరి 5 వరకు మొత్తం రూ. 400 కోట్లు చెల్లించగా,అందులో రూ. 270 కోట్లు వస్తు,సేవల పన్ను (GST) కింద ఉండగా,మిగిలిన రూ. 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించారని వివరించారు. అయోధ్య ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందుతుండటంతో, భక్తులు, పర్యాటకుల సంఖ్య పదింతలు పెరిగిందని రాయ్ హర్షం వ్యక్తం చేశారు.

వివరాలు 

మహా కుంభమేళా సమయంలో 1.26 కోట్ల మంది భక్తులు 

అయోధ్య ఇప్పుడు ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రంగా మారినందున, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. మహా కుంభమేళా సమయంలో 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యకు విచ్చేసినట్లు గుర్తు చేశారు. గత ఏడాదిలో అయోధ్యను 16 కోట్ల మంది సందర్శించగా, వారిలో 5 కోట్ల మంది శ్రీ రామ మందిరాన్ని దర్శించి భక్తిపరవశులయ్యారని చంపత్ రాయ్ వివరించారు. ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు, రికార్డులు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆలయ ట్రస్ట్ పారదర్శక ఆర్థిక నిర్వహణ, అయోధ్యలో వృద్ధి చెందుతున్న మతపరమైన పర్యాటకం, ఈ భారీ పన్నుల చెల్లింపు ద్వారా స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

2020లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు

శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పురాతన క్షేత్రంలో భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి మతపెద్దలు, రాజకీయ ప్రముఖులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 2020లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది, దీని ద్వారా ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.