Page Loader
విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు
ఎయిర్ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్‌ నిరాకరణ

విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు

వ్రాసిన వారు Stalin
Jan 12, 2023
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఒక నాన్ బెయిలబుల్ నేరం కూడా ఉందని కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ వెల్లడించారు. నవంబర్ 26, 2022న న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో శంకర్ మిశ్రా.. తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మిశ్రానుఅరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా.. ధర్మాసనం 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించింది.

ఎయిర్ ఇండియా

మూత్ర విసర్జన అంశం స్త్రీల ఆగ్రహానికి సంబంధించినది: కోర్టు

శంకర్ మిశ్రా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది స్త్రీల ఆగ్రహానికి సంబంధించిన అంశమని, అందుకే బెయిల్ ఇవ్వలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. మూత్ర విసర్జన ఘటనపై అంతర్గత కమిటీని కూడా ఎయిర్ ఇండియా యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిపై 30రోజుల నిషేధం విధించింది. అలాగే నిందింతుడిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని ప్రభుత్వానికి ఎయిర్‌ఇండియా సిఫారసు చేసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం‌ కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.