Bank accounts rented: బ్యాంకు ఖాతాలు అద్దెకు.. రూ.25 కోట్ల సైబర్ లావాదేవీలు.. ముగ్గురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చిన ముగ్గురు యువకులను పాట్న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ఖాతాల ద్వారా దాదాపు రూ.25 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటన సైబర్ నేరాల్లో ఖాతాలను వినియోగించుకుంటున్న కొత్త తరహా విధానాన్ని బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాకర్, అమిత్, దీపక్ అనే ముగ్గురు యువకులు సైబర్ మోసగాళ్లతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు ర్యాపిడో బైక్-ట్యాక్సీ రైడర్లుగా పనిచేస్తుండగా..మరో వ్యక్తి కూడా ఇదే తరహా సైబర్ నేర నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. సైబర్ నేరగాళ్లు మోసం చేసి దోచుకున్న డబ్బును ఈ ముగ్గురి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు.
వివరాలు
ఫిర్యాదులతో వెలుగులోకి..
అనంతరం ఆ మొత్తాన్ని ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించేవారు.
ఇలా తమ ఖాతాల ద్వారా జరిగే ప్రతి లావాదేవీకి నిందితులకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు కమీషన్ చెల్లించేవారని పోలీసులు తెలిపారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది.
ఫిర్యాదుల ఆధారంగా పాట్నా సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సంగీతా కుమారి నేతృత్వంలో ప్రత్యేకంగా విచారణ చేపట్టి నిందితుల వివరాలను గుర్తించారు.
వివరాలు
ఇద్దరు పాట్నాలో.. మరొకరు బక్సర్లో..
దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను పాట్నాలో అరెస్ట్ చేయగా.. మూడో నిందితుడిని బీహార్లోని బక్సర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సంగీతా కుమారి వెల్లడించారు.
వారి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
ఈ భారీ మొత్తంలో జరిగిన లావాదేవీల వెనుక ఉన్న అంతర్రాష్ట్ర సైబర్ నేర ముఠాను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? మరెవరెవరు తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చారు? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.