Loading...
NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్‌ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం
సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్‌ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం

NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్‌ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని విద్యార్థులు కోరిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అంశంపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) గురువారం తొలుత కఠిన చర్యలకు దిగింది. 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్‌ న్యాయశాస్త్ర పట్టభద్రులను ఏ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ కూడా లాయర్లుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో గంటల వ్యవధిలోనే బీసీఐ వెనక్కి తగ్గింది. తాను జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

2026 బ్యాచ్‌ స్నాతకోత్సవం నేపథ్యంలో లేఖ

2026 బ్యాచ్‌లో న్యాయ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు నల్సార్‌లో స్నాతకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సుమారు 450 మంది విద్యార్థులు ఇటీవల వర్సిటీ రిజిస్ట్రార్‌, వీసీకి ఒక లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ను ఆహ్వానించాలని వర్సిటీ పరిశీలిస్తున్నట్లు తమకు తెలిసిందని, ఆయనను కార్యక్రమానికి పిలవవద్దని విద్యార్థులు ఆ లేఖలో కోరినట్లు సమాచారం.

గత నెల ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన 'చలో పార్లమెంటు' కార్యక్రమం సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జీ, బలప్రయోగానికి సంబంధించిన వీడియోలను చూసేందుకు తనకు సమయం లేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఆయన చేతుల మీదుగా తాము పట్టాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

2026 బ్యాచ్‌ స్నాతకోత్సవం నేపథ్యంలో లేఖ

ఇది వర్సిటీ తమకు నేర్పిన విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నట్లు తెలిసింది.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కూడా గతంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకుంది.

ఆ సంస్థ విద్యార్థుల నుంచి వచ్చిన వ్యతిరేకతే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా గురువారం అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నల్సార్‌ 2026 బ్యాచ్‌ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని ఆదేశించారు.

సీజేఐపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్సార్‌ వీసీని కోరారు.

సీజేఐని ఆహ్వానించవద్దని విద్యార్థులు ఏదైనా విజ్ఞాపనపత్రం సమర్పించి ఉంటే దాని ప్రతులను, దానిపై సంతకాలు చేసిన విద్యార్థుల పూర్తి వివరాలను అందించాలని బీసీఐ ఆదేశించింది.

ఆ విజ్ఞాపనపత్రాన్ని రూపొందించినవారు, మీడియాతో సమన్వయం చేసినవారు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినవారు, స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చినవారి వివరాలను కూడా ఇవ్వాలని కోరింది.

ADVERTISEMENT

వివరాలు 

అధ్యాపకులపై మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు

అదేవిధంగా ఈ వ్యవహారంలో భాగస్వాములైన విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, బయటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించింది.

నల్సార్‌లో బోధనా సిబ్బంది మధ్య విభేదాలు, వర్గాలు ఉన్నట్లు తెలుస్తోందని బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కొందరు అధ్యాపకులు 'చిల్లర రాజకీయాలు' చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తమకు తెలిసిందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

అధ్యాపకులు పాఠాలు చెప్పాల్సింది పోయి ఇలాంటి రాజకీయాలకు పాల్పడితే బీసీఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించినట్లు సమాచారం.

వీసీ నివేదిక అందిన తర్వాత ఈ నెల 19న ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని మిశ్రా వెల్లడించినట్లు తెలిసింది.

వివరాలు 

అడ్డుకోవటానికి మీరెవరు?

బీసీఐ ఆదేశాలు వెలువడిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ ఒక వీడియో విడుదల చేసి బీసీఐ నిర్ణయాన్ని ప్రశ్నించారు.

నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు.

ఆ హక్కును వినియోగించుకుంటూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నుంచి పట్టాలు తీసుకోబోమని నల్సార్‌ విద్యార్థులు చెబితే, వారిని అడ్డుకునే అధికారం బీసీఐకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.

ఈ ఆదేశాలు పూర్తిగా చట్టవ్యతిరేకమైనవని ఆరోపించారు.

ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే బీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు మనన్‌ కుమార్‌ మిశ్రా అధికారిక నివాసం ఎదుట శాంతియుత నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు.

వివరాలు 

అడ్డుకోవటానికి మీరెవరు?

ఈ నిరసనల్లో పాల్గొనాలని లాయర్లు, న్యాయ విద్యార్థులు, రిటైర్డ్‌ జడ్జీలు, ప్రముఖులకు పిలుపునిచ్చారు.

యువతను భయపెట్టి, బెదిరించే రోజులు పోయాయని మనన్‌ కుమార్‌ మిశ్రా అర్థం చేసుకోవాలని సౌరవ్‌ దాస్‌ వ్యాఖ్యానించారు.

యువత చైతన్యవంతమైందని, బాధ్యత తీసుకుంటోందని అన్నారు.

2012 నుంచి బీసీఐ చైర్మన్‌గా ఉన్న మనన్‌ కుమార్‌ మిశ్రా ఇంతకాలంలో ఏం చేశారన్న అంశంపైనా తాము ఆరా తీస్తామని, ఆయన జవాబుదారీతనాన్ని లెక్క తేలుస్తామని పేర్కొన్నారు.

వివరాలు 

సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడి ఖండన

బీసీఐ ఆదేశాలను సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ కూడా తీవ్రంగా ఖండించారు.

న్యాయ విద్యార్థులు తమ ప్రాథమిక హక్కైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను వినియోగించుకోకుండా అడ్డుకునే, బెదిరించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు.

ఈ చర్య పూర్తిగా చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనను గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

గంటల్లోనే బీసీఐ వెనక్కి

తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

తాను గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు మరో ప్రకటనలో వెల్లడించింది.

బీసీఐ సభ్యులు ఈ అంశంపై క్షుణ్ణంగా చర్చించారని,నల్సార్‌ విద్యార్థుల్లో అత్యధికులు ఎలాంటి తప్పూ చేయలేదని,కొందరి చర్యలకు మొత్తం విద్యార్థులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో చైర్మన్‌ జారీ చేసిన ఆదేశాలను సవరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

దీంతో నల్సార్‌ విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లలో న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని బీసీఐ స్పష్టం చేసింది.

అమాయక విద్యార్థులను కొందరు అధ్యాపక సిబ్బంది, బయటి వ్యక్తులు రెచ్చగొట్టినట్లు తమకు తెలిసిందని,దీనిపై వీసీ నుంచి నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

వివరాలు 

బీసీఐ చైర్మన్‌ మిశ్రా రాజకీయ నేపథ్యంపైనా చర్చ

ఇంతటి వివాదానికి కేంద్రంగా మారిన బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా న్యాయవాది మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడు కూడా. బిహార్‌కు చెందిన మిశ్రా 2024లో బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఈ రాజకీయ నేపథ్యం కారణంగానే నల్సార్‌ విద్యార్థుల వ్యవహారంలో ఆయన తాజా ఆదేశాలు వెలువడ్డాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ అంశంపై తుది నిర్ణయం వీసీ నివేదిక అనంతరం తీసుకుంటామని బీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

ADVERTISEMENT