Loading...
Bengaluru: అధికారుల స్పందన కరవు.. సొంత డబ్బుతో ఫుట్‌పాత్‌ మరమ్మతు చేయించిన సీఈవో

Bengaluru: అధికారుల స్పందన కరవు.. సొంత డబ్బుతో ఫుట్‌పాత్‌ మరమ్మతు చేయించిన సీఈవో

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌర సమస్యపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఓ సంస్థ సీఈవో స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తన సొంత డబ్బుతో ఫుట్‌పాత్‌ను బాగుచేయించారు. ఇందుకోసం ఆయన రూ.2,700 ఖర్చు చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కోరమంగళలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి, స్టార్టప్‌ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్‌ డయలానీ తన సొసైటీ సమీపంలోని పాడైన ఫుట్‌పాత్‌ను సొంత ఖర్చుతో మరమ్మతు చేయించారు. ఆ ఫుట్‌పాత్‌ ఏళ్లుగా దెబ్బతిన్న స్థితిలోనే ఉందని, దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆయన తెలిపారు.

వివరాలు 

నాకు రూ.2,700 ఖర్చయింది: సిద్ధార్థ్

''కోరమంగళలోని మా సొసైటీ సమీపంలోని ఫుట్‌పాత్‌ ఏళ్లుగా పాడై ఉంది. బీబీఎంపీకి ఫిర్యాదు చేశాను. జీబీఏకు ఈమెయిల్‌ పంపాను. టికెట్‌ నమోదు చేశాను. వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌లోనూ సంప్రదించాను. కానీ ఎలాంటి స్పందన రాలేదు'' అని సిద్ధార్థ్‌ పేర్కొన్నారు.

ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చివరకు తానే సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

''చివరికి నేనే బాగుచేయించాలని నిర్ణయించుకున్నాను. కూలీల ఖర్చు, ర్యాంప్‌ నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ కలిపి నాకు రూ.2,700 ఖర్చయింది'' అని వివరించారు.

తాను నిర్మించిన ర్యాంప్‌ వల్ల నడవడానికి ఇబ్బంది ఉన్నవారికి ఆ ప్రాంతాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని సిద్ధార్థ్‌ తెలిపారు.

''పిల్లలను స్ట్రోలర్‌లో తీసుకెళ్లే తల్లిదండ్రులు,వీల్‌చైర్‌ ఉపయోగించే వృద్ధులు ఇప్పుడు దీన్ని సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు'' అని అన్నారు.

వివరాలు 

ఇలాంటి సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దాం

నగరంలోని ఇలాంటి పౌర సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు కలిసి పనిచేయాలని సిద్ధార్థ్‌ సూచించారు.

తన పోస్టులో పారిశ్రామికవేత్త కిరణ్‌ మజుందార్‌-షా, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌లను ట్యాగ్‌ చేశారు.

''బెంగళూరులోని మరిన్ని ప్రాంతాలకు ఈ ప్రయత్నాన్ని విస్తరించేందుకు మనం కలిసి పనిచేయాలి'' అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

నెటిజన్ల భిన్న స్పందనలు

సిద్ధార్థ్‌ చొరవను పలువురు నెటిజన్లు అభినందించగా, మరికొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజా మౌలిక సదుపాయాలకు మరమ్మతులు చేయడంలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ప్రస్తావించారు.

''బీబీఎంపీ ఈ పనికి రూ.5 లక్షలు ఖర్చు చేసేది.ప్రజా ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణతో మీపై కేసు పెట్టవచ్చు'' అని ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించారు.

మరో వ్యక్తి,''మీరు వారి భాష మాట్లాడరు కాబట్టి వారు మిమ్మల్ని అభినందించకపోవచ్చు''అని రాశారు. ఇంకొకరు,''ఇలాంటి ప్రదేశాన్ని మార్చినందుకు చట్టపరమైన సమస్యలు మీపైనే పడొచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అయినా మంచి పని చేశారు'' అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

నెటిజన్ల భిన్న స్పందనలు

మరో నెటిజన్‌ స్పందిస్తూ, ''ధన్యవాదాలు సిద్ధార్థ్‌. పరిస్థితి ఇంతవరకు రావడం బాధాకరం. ముందుగా పన్నులు చెల్లించాలి. ఆ తర్వాత ప్రాథమిక పౌర సదుపాయాల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.2,700తో ఫుట్‌పాత్‌ బాగుచేసిన సీఈవో

ADVERTISEMENT