Page Loader
Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి
తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విస్తృత స్థాయిలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు,భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీని ఒక ఆర్థిక లాభాల కేంద్రంగా మలచేసి, స్వామివారి ఖజానాకు పూర్వ పాలకులు తీవ్రమైన నష్టం కలిగించారని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ ఆరోపణలు చేశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే తులాభారం కానుకల రూపంలో వచ్చిన నగదును టీటీడీకి చెందిన కొంతమంది సిబ్బంది దోచుకున్నట్టు తనకు సమాచారం ఉందని ఆయన అన్నారు.

వివరాలు 

విజిలెన్స్ శాఖ సిబ్బందిపై కూడా విచారణ

ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు చెప్పారు. తన వద్ద ఉన్న కొన్ని కీలక ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందజేశానని వెల్లడించారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో చోటుచేసుకున్న నిబంధనలకు విరుద్ధమైన చర్యలపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా, గతంలో విధులు నిర్వహించిన కొంతమంది ఉన్నతాధికారులు,విజిలెన్స్ శాఖ సిబ్బందిపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాలు 

తులాభార కానుకల్లో సగం నగదే లెక్కల్లో చూపించి..

"పరకామణిలో జరిగిన దొంగతనం,కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు, భక్తులు తులాభారంగా సమర్పించిన కానుకలను దోచుకున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అప్పట్లో విజిలెన్స్ అధికారులు తులాభారంలో జరిగిన అక్రమాలను గుర్తించినప్పటికీ, అప్పటి ఉన్నతాధికారులు వాటిని కనుసన్నల్లో పెట్టుకొని ఎటువంటి చర్యలు తీసుకోకపోయారు" అని ఆయన విమర్శించారు. భక్తుల తులాభార కానుకల్లో సగం నగదే లెక్కల్లో చూపించి, మిగిలిన సగం అక్రమంగా మార్చేసినట్టు ఆరోపించారు. పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ ఉద్యోగి విషయంలో కేవలం పరస్పర పంచాయతీ పెట్టినట్లు నటించి, అతనిపై ఎలాంటి శిక్షార్ధక చర్యలు తీసుకోకుండా వదిలేశారని మండిపడ్డారు.

వివరాలు 

 అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ 

అలాగే తులాభారంలో అక్రమాలకు పాల్పడిన వారి పట్ల కూడా ఇలాంటి విధమే జరిగిందని ఆరోపించారు. ఈ పరిస్థితులన్నింటినీ బట్టి, స్వామివారి ఆభరణాలకూడా అపహరణకు గురై ఉండవచ్చన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అన్ని అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నింటినీ మంగళవారం నిర్వహించనున్న టీటీడీ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించి, అధికారికంగా చర్చకు తీసుకురాబోతున్నట్లు భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.