LOADING...
Bharat Band: భారత్ బంద్‌.. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?
భారత్ బంద్‌.. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

Bharat Band: భారత్ బంద్‌.. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు పలు రంగాలకు చెందిన 30 కోట్లకుపైగా కార్మికులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ నేడు సాధారణ జీవన విధానంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముంది. ఇటీవల ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

వివరాలు 

భారత రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం

భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా సేవలు పనిచేస్తాయా లేదా అనే విషయంపై ప్రజల్లో స్పష్టత లేకపోవడం కనిపిస్తోంది. ఇదే సమయంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త కిసాన్ మోర్చా (SKM) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. దిగుమతి వస్తువులు దేశీయ మార్కెట్లలోకి ఎక్కువగా వస్తే, స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు పోటీ తట్టుకోవడం కష్టమవుతుందని హెచ్చరించింది.

వివరాలు 

రైతుల జీవనోపాధికి ముప్పు

సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ హన్నన్ మొల్లా ఈ ఒప్పందాన్ని రైతులపై చేసిన అన్యాయంగా అభివర్ణించారు. పెరుగుతున్న దిగుమతుల కారణంగా వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోయే అవకాశం ఉందని, దీని వల్ల రైతుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు పలు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని సమర్థించారు. కీలకమైన వ్యవసాయ రంగాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పాల ఉత్పత్తులు,ప్రధాన ఆహార ధాన్యాలు,కూరగాయలు,సుగంధ ద్రవ్యాలు వంటి అంశాలను సుంకాల రాయితీల పరిధిలోకి తీసుకురాలేదని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం

అయితే భారత్ బంద్ కారణంగా బ్యాంకులు, పాఠశాలలు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనలు,ర్యాలీలు జరిగితే ప్రజా రవాణా, రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు స్థానిక పాలనా యంత్రాంగం,రవాణా శాఖలు విడుదల చేసే తాజా సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ప్రాంతాల పరిస్థితులను బట్టి ప్రైవేట్ కార్యాలయాలు,వ్యాపార సంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రవాణా సమస్యలు తలెత్తే సూచనలతో కొన్ని చోట్ల విద్యాసంస్థలు మూతపడే అవకాశమూ ఉండటంతో,ప్రజలు తెలంగాణలో భారత్ బంద్‌కు సంబంధించిన అధికారిక అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement