Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పెట్రోల్ బంకులకు కొత్త టైమింగ్స్? రోజుకు 16 గంటలే సేవలు!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా సంక్షోభం నెలకొంది. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ముడి చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. దీంతో భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలు తలెత్తుతున్నాయి. దీని ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పష్టంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కొంత మేర సద్దుమణిగినప్పటికీ, రానున్న రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ప్రజలకు మోదీ కీలక సూచన
ఈ పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగించాలని, కార్పూలింగ్ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఇంధన పొదుపు చర్యలు తాత్కాలికంగా అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని సూచనల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా పొదుపు చర్యలను అమలు చేస్తోంది. అలాగే మంత్రులు నారా లోకేశ్ సహా పలువురు తమ కాన్వాయ్ వాహనాల వినియోగాన్ని తగ్గించినట్లు సమాచారం.
వివరాలు
ఇంకా ఆమోదం తెలపిన రాష్ట్ర ప్రభుత్వం
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య (APPFT) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంధన పొదుపు చర్యలకు మద్దతుగా నిలుస్తూ బంకుల నిర్వహణ సమయాలను మార్చాలని ప్రతిపాదించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ బంకులు పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం 24 గంటల పాటు ఇంధనం అందుబాటులో ఉంచుతామని సమాఖ్య స్పష్టం చేసింది. APPFT రాష్ట్ర అధ్యక్షుడు రవి గోపాలకృష్ణ నేతృత్వంలోని బృందం పౌర సరఫరాల శాఖ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ కొత్త సమయాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.