
TCA: హెచ్సీఏ కేసులో బిగ్ట్విస్ట్.. అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం: టీసీఏ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ,ఈడీ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు పలువురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది.హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాల వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)ఆరోపించింది. ఈ మేరకు టీసీఏ అధ్యక్షుడు యండల లక్ష్మీ నారాయణ,కార్యదర్శి గురువారెడ్డి కలిసి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా,జాన్ మనోజ్,విజయానంద్,పురుషోత్తం అగర్వాల్,సురేందర్ అంగర్వాల్,వంకా ప్రతాప్ లపై కూడా విచారణ జరిపించాలంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివరాలు
హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం
ఈ సందర్భంగా టీసీఏ నేతలు మాట్లాడుతూ.. హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉన్నట్టు స్పష్టం చేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో అకస్మాత్తుగా జగన్మోహన్ రావు మైదానంలోకి రావడం వెనుక కూడా వీరి ప్రమేయం ఉందని ఆరోపించారు. క్రికెట్ కు ఏమాత్రం సంబంధం లేని ఈ ఇద్దరు నాయకులు జగన్మోహన్ రావు వెంట ఉండి ఆయన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత తన విజయం కేటీఆర్,కవిత,హరీశ్ రావులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడని గుర్తు చేశారు.
వివరాలు
జగన్ వెనుక మద్దతుగా ఉన్న వారిపై కూడా విచారణ జరిపించాలని సీఐడీకి ఫిర్యాదు
జగన్ వెనుక మద్దతుగా ఉన్న వారిపై కూడా విచారణ జరిపించాలని కోరుతూ సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హెచ్సీఏలో ఇంకా కొందరు అక్రమార్కులు ఉన్నారని,వారిపై కూడా దర్యాప్తు జరిపించాల్సిందిగా సీఐడీకి విజ్ఞప్తి చేసినట్టు టీసీఏ అధ్యక్షుడు యండల లక్ష్మీ నారాయణ,కార్యదర్శి గురువారెడ్డి వెల్లడించారు.