TCS Nashik Case Update: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నాసిక్ బాబాను కాపాడేందుకే కుట్ర అంటూ ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
టీసీఎస్ నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడుల ఆరోపణలతో నమోదైన కేసు సంచలనం రేపుతున్న వేళ, దీనిలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. నాసిక్కు చెందిన దొంగ బాబా అశోక్ ఖరత్ను అత్యాచారం ఆరోపణల నుంచి కాపాడేందుకే తమ కుమార్తెపై రాజకీయ ప్రేరేపితంగా తప్పుడు కేసు పెట్టారని నిందితురాలు నిదా ఖాన్ తల్లిదండ్రులు ఆరోపించారు. నిదా ఖాన్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని, ఆమెను ఒక కుట్రలో భాగంగా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం నిదా గర్భవతి అని, భివాండిలో తన అత్తగారి ఇంట్లో ఉంటోందని చెప్పారు. ఈ ఆరోపణలతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు.
వివరాలు
ఇతర మతాల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు
తన కుమార్తె ఎవరినీ మతం మార్చమని ఒత్తిడి చేయలేదని, ఇతర మతాల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు, నాసిక్ పోలీసులు నిదా ఖాన్ భర్తను అదుపులోకి తీసుకుని, ఆమె ఆచూకీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఆరోపణలపై టీసీఎస్ స్పందిస్తూ, తమ ఎథిక్స్ లేదా పోష్ (లైంగిక వేధింపుల నిరోధక) వ్యవస్థల ద్వారా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ప్రాథమిక సమీక్షలో తేలిందని వెల్లడించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం కంపెనీ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్ కేకీ మిస్త్రీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
వివరాలు
పోలీసులకు పూర్తి సహకారం అందించాం
కేసుతో సంబంధం ఉన్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసి, పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో నిదా ఖాన్ తమ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్గా మాత్రమే పనిచేస్తోందని టీసీఎస్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఏడుగురు పురుషులు, ఒక మహిళను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం గాలింపు కొనసాగుతోంది.