
Nitish Kumar: బిహార్ సీఎం కీలక ప్రకటన .. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తాం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్న ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ఉద్దేశంతో ఆయన ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2025 నుంచి 2030 మధ్య కాలంలో మొత్తం కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల హామీ దాదాపు నెరవేరినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని.. మరో 39 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించామని నీతీశ్ పేర్కొన్నారు.
Details
ప్రస్తుతం 10లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం
గతంతో పోల్చితే ఈసారి రెట్టింపు సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమవకుండా.. ప్రైవేటు, పారిశ్రామిక రంగాల్లోను ఉద్యోగ సృష్టి కోసం శ్రమిస్తున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాలను లక్ష్యంగా చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ''ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.
Details
ఈ ఏడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు
మరో 39 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించాం. 50 లక్షల ఉద్యోగాల హామీకి దాదాపు రూపురేఖలు ఇచ్చాం. ఇప్పుడు లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే లక్ష్యం. అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టామని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిహార్లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆయన తాజా ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యత కూడ ఉంది.