Bill Gates: ఈ నెల 18న అమరావతికి బిల్ గేట్స్?
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికత వినియోగంపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది.
వివరాలు
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులపై స్పష్టత?
ఇదే క్రమంలో గత ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య సేవల ఎనలిటిక్స్, డిజిటల్ వ్యవసాయం, పాలనలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగించి ప్రజలకు వేగవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుల అమలుపై కూడా ఈ భేటీలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. అలాగే అమరావతిలో ప్రతిపాదిత క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ అంశంపై కూడా బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.